Tuesday, September 30, 2025

భారత దేశంలో వ్యక్తిగత స్వేచ్చ, ఆర్ధిక స్వేచ్చ

 భారత దేశంలో పౌర హక్కులు, స్వేచ్చ మెండు గానూ, ఆర్ధిక హక్కులు చాల తక్కువగానూ ఉండేవని మొన్నటి దాకా అందరూ అంగీకరించిన విషయం. సింగపూర్ లాంటి దేశాల్లో అది రివర్స్! అక్కడ పౌర హక్కులు లుప్తం, గానీ ఆర్ధిక రంగంలో వెసులుబాటు చాలా మెరుగు. తూర్పు ఆసియా దేశాలు మనల్ని వెనక్కి నెట్టి చాలా ముందుకు పోవడానికి ఈ ఆర్ధిక స్వేచ్చే కారణం.

అయితే, ఇప్పటి సంగతేంటి? మోడీ రాజ్యంలో మన స్థితిగతులు మెరుగుపడ్డాయా? ఆర్ధిక విషయాల్లో అచ్చే దిన్ దేవుడెరుగు, లేనిపోని తలనెప్పులు వచ్చాయి. మరి పౌర హక్కులు? అవి మాత్రం రోజురోజుకీ తరుగుతున్నాయి. పౌరస్వేచ్చ కాలరాయబడుతోంది. మనం రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం!
వ్యాపారం చెయ్యాలంటే అలవికాని నియంత్రణలు అలానే ఉండగా, భయంకరమైన టాక్సులు మన నడ్డి విరగగొడుతున్నాయి. అనేక రంగాల్లో ప్రభుత్వ జోక్యం విపరీతం. ఎగుమతులు చెయ్యలన్నా, దిగుమతులు చేసుకోవాలన్నా ప్రభుత్వం విధించే సుంకాలూ, ఆంక్షలూ తట్టుకోవాలి.
పౌర స్వేచ్చ విషయానికి వస్తే, సినిమాకి వెళ్తే జనగణమన నించుని పాడి డేశభక్తి నిరూపించుకోవాలి! గొడ్డు మాంసం మీద అంక్షలతో మొదలయ్యి, మెల్లగా ఏ మాంసం తినాలన్నా ఆంక్షల దిశగా వెళుతున్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలు పాలవ్వాలి, యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే బుల్డోజర్తో ఇల్లు కూలుతుంది. యువకులు పార్కుల్లో ప్రేమికులతో తిరిగితే పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్నెట్ యాక్టివిటీపై నిఘా ఎక్కువయ్యింది.
పౌర హక్కులు తగ్గుతుంటే మరి ప్రజల్లో ఎందుకు నిరసన గట్టిగా వినిపించట్లేదు? ఒక్కక్క విషయంలో వారి-వారి సామాజిక మూలాలను బట్టి ఎవరికి వారు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మైనార్టీల ఆర్ధిక/సామాజిక జీవనంపై దాడి జరుగుతోంది. మెజారిటీ వర్గానికి ఇంకా అంత చురుకు తగల్లేదు.
మొత్తానికి, రెంటికీ చెడ్డ రేవడి అయ్యాం! ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం!

Saturday, September 20, 2025

భారత దేశానికి ప్రధాన శత్రువు

 భారత దేశానికి ప్రధాన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడడమా? ఇంతకీ ఎందుకు మనం ఆధారపడవలసి వస్తోంది?

ఎగుమతుల సంగతి దేవుడెరుగు, మన మానుఫాక్చరింగ్ రంగం మన అవసరాలను కూడా ఎందుకు తీర్చలేకపోతుంది? ఎందుకు మన ఉత్పత్తులు చైనా కంపెనీలతో పోటీ పడలేక పోతున్నాయి?
మన అసలైన శత్రువులు ఇవి:
- గవర్నమెంట్ ఇంకా రెగ్యులేషన్ లను కొనసాగిస్తుండడం.
- అత్యంత అవసరమయిన సంస్కరణలను బుట్ట దాఖలు చెయ్యడం.
- గవర్నమెంట్ వ్యాపారం చెయ్యాలని చూడడం. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యకపోవడం.
- రాజకీయ పార్టీల దృష్టంతా వచ్చే ఎన్నికలు గెలవడమెలా అని తప్పితే దేశాన్ని ఆర్ధికంగా ఎలా అభివ్రుద్ధి చెయ్యాలో పట్టక పోవడం.
- విద్య, ఆరొగ్యం, పోలిసింగ్ విషయంలో సంస్కరణలు తేవాలని అస్సలు పట్టక పోవడం.
- ఘోరమయిన న్యాయ వ్యవస్థ
- స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చెయ్యకుండా అంతా PM/CM/DM చుట్టూరా తిరిగేటట్టు చెయ్యడం.
రెగ్యులేషన్ల వల్ల, అలవి కాని రూల్స్ వల్ల బలి అయ్యేది చిన్న-మధ్య తరహా పరిశ్రమలే. నానా రకాల రూల్స్ పేరిట గవర్నమెంట్ అధికారులు పీడించడంతో వ్యాపారవేత్తలు పరిశ్రమలు పెట్టాలంటే జంకే పరిస్తితి. ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం? బంగారం, రియల్ ఎస్టేట్ లపై పెడితే సరిపోతుందిగా! ఇంక బడా పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులనూ, అధికారులను మచ్చిక చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. రూల్స్ ఎన్ని ఎక్కువ వుంటే అంత మంచిది. పోటీ అనేది వుండదు. ఎంత నాసిరకమయిన ఉత్పత్తి అయినా, ధర ఎంత ఎక్కువున్నా వినియోగదారులు చచ్చినట్లు కొనాల్సిందే! ఇతర దేశాల కంపెనీలు తక్కువ ధరకు అందిస్తున్నాయా? దిగుమతులపై సుంకం విధించాలని గవర్నమెంట్ పై వత్తిడి తెస్తే సరి!
- అసలు పరిశ్రమలు నడపాలంటే కార్మిక చట్టాల సంస్కరణ చెయ్యాలి కదా?
- పరిశ్రమకు భూమి కావాలంటే భూసేకరణ అత్యంత క్లిష్టమయినది కదా?
- వ్యవసాయ చట్టాలను ఎప్పుడు మరి సంస్కరించడం?
ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఇంక ఆ రంగం సంక నాకి పొయినట్టే అని తెలిసే కదా, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయ్యడం ప్రారంభించింది పీవీ, వాజపేయిలు. మరి ఇప్పుడు నేను ఏదో ఉద్ధరిస్తాను అని బయల్దేరడమేంటి?
కనీసం రక్షణ రంగం లోనన్నా ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు, సంతోషం! లేకపోతే దశాబ్దాల తరబడి పరిశోధనలు చేసినా ఒక్క సరయిన ఎయిర్క్రాఫ్ట్ ఎంజిన్ కూడా సరిగా ఉత్పత్తి చెయ్యడం HAL వల్ల కాలేదు!
ఇవన్నీ చెయ్యకుండా ఆత్మనిర్బర్ భారత్ అని జబ్బలు చరుచుకుని కాలం వెళ్ళదీస్తే, రేపు ఆర్ధికంగానే కాదు, దేశ రక్షణ పరంగా కూడా ప్రమాదమే!